Karnataka Elections | బెంగళూరు, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో వచ్చే నెల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి తప్పదా? అవినీతి, అసమర్థ పాలనతో తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్న కమలం పార్టీకి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో యెడియూరప్ప బీజేపీపై ప్రతీకారం తీర్చుకొనే అవకాశం లేకపోలేదని పరిశీలకులు చెబుతున్నారు. వృద్ధాప్యం పేరుతో సీఎంగా తనను తప్పించి, బొమ్మైను ఆ స్థానంలో కూర్చోబెట్టడం, ఆ తర్వాత తనపై అధిష్ఠానం ప్రదర్శించిన నిర్లక్ష్యంపై యెడియూరప్ప ఇప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.గతంలో కూడా యెడియూరప్ప సొంత పార్టీ పెట్టినప్పుడు బీజేపీ చావుదెబ్బ తిన్నది. 2008 ఎన్నికల్లో 110 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ, యెడియూరప్ప స్థాపించిన కర్ణాటక జనతా పక్ష పార్టీ ప్రభావం కారణంగా తర్వాతి 2013 ఎన్నికల్లో కేవలం 40 స్థానాలకు పరిమితమైంది. బొమ్మై సర్కార్ అవినీతి, అసమర్థతకు తోడు వీరశైవ, లింగాయతుల్లో గట్టి పట్టు ఉన్న యెడియూరప్ప.. అంతర్గతంగా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినా లేదా పార్టీ తరపున సరిగా పనిచేయకపోయినా, కమలం పార్టీకి ఘోర పరాభవం తప్పదనే విశ్లేషణలు వస్తున్నాయి.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రంగా ఉన్నాయి. బీజేపీ గెలువాలంటే యెడియూరప్ప అవసరం ఉన్నదని గుర్తించిన నాయకత్వం ఆయన్ను బుజ్జగించే పనిలో పడింది. అయితే గతంలో మాదిరిగా పార్టీ వ్యవహారాల్లో ప్రాధాన్యం ఇవ్వటం లేదన్నది బహిరంగ రహస్యం. ఆరెస్సెస్, సీఎం బొమ్మై , యెడియూరప్ప గ్రూపులుగా బీజేపీ నేతలు విడిపోయారు. దీంతో పార్టీకి అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. బెళగావి, శివమొగ్గ జిల్లాల్లో టిక్కెట్టు లభించని నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
బొమ్మై ప్రభుత్వంపై ‘40 శాతం కమీషన్’ సర్కార్గా ముద్రపడింది. పనులు కేటాయించాలన్నా, చేసిన పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయాలన్నా బీజేపీ నేతలు, అధికారులు 40% కమీషన్ లంచంగా డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్లే బహిరంగంగా చెబుతున్నారు. ఈ అవినీతి దాహానికి పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. మరికొందరు ‘కమీషన్ రాజ్యం’పై జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖలు కూడా రాశారు.
రిజర్వేషన్లలో మార్పులు బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి బొమ్మై సర్కార్ బదిలీ చేసింది. ఈ నిర్ణయంపై బ్రాహ్మణులు అసంతృప్తిగా ఉన్నారు. 15 శాతమున్న ముస్లింలతో 4 శాతం మంది ఉన్న తాము ఎలా పోటీపడగలమని ప్రశ్నిస్తున్నారు. ఒక్కలిగలు, పంచమశాలీ లింగాయతులకు రిజర్వేషన్లు రెండు శాతం చొప్పున పెంచారు. పంచమశాలీల్లో ఒక వర్గం సోమవారం బెళగావిలో రిజర్వేషన్ల శాతం పెంపు ఉత్తర్వులను తగులబెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.