న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక ఎన్నిక పోలింగ్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకుంటుండగా విపక్షాల తరపున బరిలో నిలిచిన రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా మోదీ సర్కార్పై ఆరోపణలు గుప్పించారు. తనకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేపారని, ధన ప్రవాహంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేశారని కాషాయ పాలకులపై విరుచుకుపడ్డారు.
ఈ ఎన్నికల ఫలితం దేశ ప్రజాస్వామ్య వ్యవస్ధను ప్రతిబింబించే క్రమంలో ప్రజా ప్రతినిధులు విచక్షణతో ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికలకు చాలా కీలకమని, ఎన్నికల ఫలితం దేశ ప్రజాస్వామ్య ప్రస్ధానాన్ని నిర్ధేశిస్తుందని, ఓటర్లు విచక్షణతో ఓటు వేసి తనను గెలిపించాలని సిన్హా విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వెలుపల యశ్వంత్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రలోభాలకు గురిచేశారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలక పార్టీ దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కేంద్రం ప్రజాస్వామ్య విరుద్ధంగా కూల్చివేసిందని దుయ్యబట్టారు. తాను కేవలం రాజకీయ యుద్ధంలోనే పోరాడటం లేదని, ప్రభుత్వ ఏజెన్సీలపైనా పోరాడుతున్నానని అన్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు శక్తివంతంగా తయారయ్యాయని, అవి పార్టీలను చీల్చుతూ ప్రజలను తమకు అనుకూలంగా ఓటు వేసేలా ఒత్తిడి తెస్తున్నాయని గతంలో ఐఏఎస్ అధికారిగానూ పనిచేసిన సిన్హా కాషాయ పాలకులపై విమర్శలు గుప్పించారు.