డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే ఇవాళ్టి నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాలను తెరవనున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసులు తమ ట్విట్టర్లో పేర్కొన్నారు. జోషీమఠం వద్ద బద్రీనాథ్ హైవేను మూసివేయడం వల్ల .. ఇప్పుడే బద్రీనాథ్ యాత్రను ప్రారంభించడం లేదన్నారు. త్వరలోనే బద్రీనాథ్ యాత్రను కూడా ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఉత్తరాఖండ్లో పర్యటించనున్నారు. అక్కడి పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. వరుస వర్షాల వల్ల ఆ రాష్ట్రంలో సుమారు 50 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే. సుందర నైనిటాల్ నగరం .. వానలు, వరధ ధాటికి తీవ్రంగా నష్టపోయింది. నైనీ సరస్సు ఉప్పొంగడంతో.. నగరం అంతా అస్తవ్యస్తమైంది. ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ థామితో .. కేంద్ర మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.