న్యూఢిల్లీ, జూన్ 7: రెజ్లర్ల పోరాటానికి కేంద్రం తలొగ్గింది. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు బేషరతుగా అంగీకరించింది. బుధవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో ఆరు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, తదితరులు ఐదు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఈ అన్ని డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని రెజ్లర్లకు అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. అయితే, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ను అరెస్టు చేయాలని రెజ్లర్లు చేస్తున్న ప్రధాన డిమాండ్పై ప్రతిష్టంభన నెలకొన్నది.
జూన్ 15 నాటికి బ్రిజ్భూషణ్పై పోలీసులు విచారణ పూర్తి చేసి చార్జ్షీట్ నమోదు చేస్తారని, అప్పటివరకు ఆందోళనను వాయిదా వేయాలని రెజ్లర్లను అనురాగ్ ఠాకూర్ కోరారు. అన్ని డిమాండ్లకు ‘ఓకే’బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయడంతో పాటు రెజ్లింగ్ ఫెడరేషన్లో ఆయన, అతడి కుటుంబసభ్యుల జోక్యం ఉండొద్దని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ప్రసిడెంట్గా ఓ మహిళ ఉండాలని, తమపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని రెజ్లర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఫెడరేషన్లో మహిళ నేతృత్వంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. వీటన్నింటినీ నెరవేరుస్తామని అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. జూన్ 30 లోగా ఫెడరేషన్ ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల ప్రక్రియలో బ్రిజ్భూషణ్, అతడి సహచరులను అనుమతించబోమని తెలిపారు.
తమ పోరాటం ముగియలేదని, ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జూన్ 15 వరకు వాయిదా వేస్తున్నామని సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ప్రకటించారు. మే 28న తమపై నమోదు చేసిన కేసును ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలిపారు.