Wrestlers Protest | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని టాప్ వుమెన్ రెజ్లర్లు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో పోలీసులు రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్పై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు ఏడుగురు మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
లైంగిక వేధింపుల ఆరోపణలపై త్వరలోనే స్టేట్మెంట్ను నమోదు చేయనున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. రెజ్లర్ల ఫిర్యాదు మేరకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై కన్నాట్ ప్లేస్ పోలీసులు మైనర్ రెజ్లర్ను వేధించిన కేసులో పోక్సో చట్టం కింద ఓ కేసు నమోదు చేయగా.. మహిళా రెజ్లర్ల ఆరోపణలపై మరో మరో కేసు నమోదైంది. ఈ కేసుల్లో మైనర్తో సహా ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్లందరి వాంగ్మూలాలను రికార్డు చేయనున్నట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. రెజ్లర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు బ్రిజ్ భూషణ్ఫై సెక్షన్ 354, 354ఏ, 354డీ, 34 కింద కేసు నమోదు చేశారు.