న్యూఢిల్లీ, జనవరి 19: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్భూషణ్ను పదవి నుంచి తొలగించాల్సిందేనని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఆయనను జైలుకు పంపే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టంచేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద గురువారం రెండో రోజు కూడా వారు తమ నిరసనను కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వ హామీలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి తమకు సంతృప్తికర సమాధానం రాలేదని పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, బ్రిజ్ భూషణ్ను జైలుకు పంపే వరకు తాము నిరసన కొనసాగిస్తామని రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షిమాలిక్, బజరంగ్ పునియా వెల్లడించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము పోలీసులను ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు.
72 గంటల్లో వివరణ ఇవ్వండి
రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. 72 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డబ్ల్యూఎఫ్ఐను హెచ్చరించింది. మరోవైపు, కేంద్ర తరఫున రాయబారిగా స్టార్ రెజ్లర్, బీజేపీ నాయకురాలు బబితా ఫొగాట్ రెజ్లర్లతో చర్చలు జరిపారు. ప్రభుత్వం రెజ్లర్లకు అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం క్రీడా శాఖ అధికారులు కూడా రెజ్లర్లతో చర్చలు జరిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, నిరసన విరమించాలని కోరారు. అయితే ప్రభుత్వం హామీలతో సరిపెట్టకుండా, తక్షణమే చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. మరోవైపు, రెజర్ల ఆరోపణలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఢిల్లీ పోలీసులకు, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేశారు. కాగా, రెజ్లర్లకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష బాసటగా నిలిచారు. మహిళా అథ్లెట్ల భద్రతకు సాధ్యమైనదంతా చేస్తామని చెప్పారు.
ప్రధాని స్పందించాలి..
రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ప్రధాని ఈ విషయమై స్పందించాలని, బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్, సమాజ్వాదీ, ఎన్సీపీ డిమాండ్ చేశాయి. తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్భూషణ్ తన పదవికి ఈ నెల 22న జరిగే డబ్ల్యూఎఫ్ఐ సాధారణ మండలి సమావేశంలో రాజీనామా చేయనున్నట్లు తెలుస్తున్నది.
24 గంటల్లో రాజీనామా చేయండి ఆందోళన నిర్వహిస్తున్న రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం రాత్రి సమావేశమయ్యారు. 24 గంటల్లో రాజీనామా చేయాలని బ్రిజ్ భూషణ్ను క్రీడాశాఖ ఆదేశించినట్టు సమాచారం.