న్యూఢిల్లీ : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రెజ్లర్లతో (Wrestlers Protest) కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంప్రదింపులు జరుపుతున్నారు. మంత్రి ఆహ్వానం మేరకు బుధవారం మధ్యాహ్నం రెజ్లర్లు భజరంగ్ పునియా, సాక్షి మాలిక్ అనురాగ్ ఠాకూర్తో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ను అరెస్ట్ చేయాలని ఈ భేటీలో వారు ప్రధానంగా పట్టుపడుతున్నారు.
మరోవైపు మంత్రితో భేటీకి ముందు సాక్షి మాలిక్ ఇదే విషయం స్పష్టం చేశారు. బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా తమ నిరసనను విరమించడం లేదని, ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనతో ముందుకొస్తుందో పరిశీలించేందుకు వేచిచూస్తామని సాక్షి మాలిక్ స్పష్టం చేశారు. ఖాప్ పంచాయత్ నేతలతో ప్రభుత్వ సంప్రదింపుల్లో ముందుకొచ్చిన ప్రతిపాదనపైనే తాము చర్చిస్తామని, ఇతర ప్రతిపాదనలను తాము ఆమోదించబోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వంతో బహిరంగ చర్చల కోసం తాము వేచిచూస్తున్నామని మహిళా రెజ్లర్లు పేర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చల సందర్భంగా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి అమిత్ షాతో రెజ్లర్ల సమావేశం అసంపూర్తిగా ముగియడంతో అనురాగ్ ఠాకూర్తో రెజ్లర్ల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు రెజ్లర్ల సమస్యలపై సంప్రదింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. తాను మరోసారి రెజ్లర్లను చర్చలకు ఆహ్వానిస్తున్నానని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. ఇక క్రీడా మంత్రి ఠాకూర్తో రెజ్లర్ల సమావేశంపై స్పందించేందుకు బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ నిరాకరించారు. కాగా కేంద్ర మంత్రి రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించడంపై ద్రోణాచార్య అవార్డు గ్రహీత, రెజ్లింగ్ కోచ్ మహవీర్ సింగ్ పొఘట్ స్పందించారు. నిద్రలో జోగుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవడం సంతోషకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Read More
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్లు రెఢీ.. ఎందుకంటే