లండన్: ఓవల్ వేదికగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇండియా మధ్య వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్ జరగనున్నది. అయితే ప్రస్తుతం బ్రిటన్లో ఇంధన సంస్థలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ వేదికను ధ్వంసం చేయనున్నట్లు ఇప్పటికే ఆ నిరసనకారులు వార్నింగ్ ఇచ్చారు. పిచ్ కూడా దెబ్బతీయనున్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. కెన్నింగ్టన్ ఓవల్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఫైనల్ కోసం రెండు పిచ్లను సిద్ధంగా ఉంచింది. ఐసీసీ నిబంధనల మేరకే ఆ పిచ్లను రెఢీ చేసినట్లు చెప్పింది.
గ్రౌండ్ వద్ద సెక్యూర్టీని కూడా పెంచినట్లు ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ సెక్షన్ 6.4 రూల్ ప్రకారం .. బ్యాకప్ పిచ్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ జరిగే పిచ్ దెబ్బతింటే అప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత మరో పిచ్ను వాడాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోనున్నారు. రెండు పిచ్ల రూల్ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్కు తెలియజేశారు. ఒకవేళ ఇద్దరు కెప్టెన్లు రెండో పిచ్పై ఆడేందుకు అంగీకరిస్తే అప్పుడు మ్యాచ్ కొనసాగుతుంది, లేదంటే రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి.