న్యూఢిల్లీ: సీపీఎం నాయకురాలు బృందా కారత్కు చేదు అనుభవం ఎదురైంది. నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆమెను వేదిక నుంచి వెళ్లిపోవాలని రెజ్లర్ బజరంగ్ పునియా కోరారు. తమ నిరసనను రాజకీయం చేయవద్దని ఆయన అన్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్పై మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్తో పాటు పలువురు కోచ్లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
కాగా, సీపీఎం నాయకురాలు బృందా కారత్, రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపేందుకు వారు నిరసన చేస్తున్న జంతర్ మంతర్ వద్దకు గురువారం వచ్చారు. నిరసన చేస్తున్న వేదికపైకి ఆమె వెళ్లగా, ఒలింపిక్స్తోపాటు, 2022 కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన రెజ్లర్ బజరంగ్ పునియా అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసన వేదిక నుంచి దిగిపోవాలని బృందా కారత్ను కోరారు. అలాగే రెజ్లర్ల నిరసనకు రాజకీయ రంగు పులమవద్దని సూచించారు. నిరసనలో పాల్గొన్న మరి కొందరు రెజ్లర్లు కూడా చేతులు జోడించి వేదిక నుంచి వెళ్లిపోవాలని బృందా కారత్ను అభ్యర్థించారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | CPI(M) leader Brinda Karat asked to step down from the stage during wrestlers' protest against WFI at Jantar Mantar in Delhi. pic.twitter.com/sw8WMTdjsk
— ANI (@ANI) January 19, 2023