ఫిరోజాబాద్, ఆగస్టు 11: రద్దీగా ఉన్న ఓ రోడ్డు డివైడర్ మీద కానిస్టేబుల్ మనోజ్ కుమార్ చేతిలో ఓ ప్లేట్ పట్టుకొని కూర్చున్నాడు. పళ్లెంలోని రోటీ, అన్నం, పప్పుని దారినపోతున్న అందరికీ చూయిస్తూ ఏడుస్తున్నాడు. ‘భాయ్.. ఈ ఫుడ్ను కుక్కలైనా తింటాయా? రేయింబవళ్లు నిద్రాహారాలు మాని డ్యూటీ చేసే పోలీసులకు ఇలాంటి తిండి పెడితే.. మేమెలా బతుకుతాం? డ్యూటీ ఎలా చేస్తాం?’ అంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. ప్లేట్లోని ఆహారాన్ని చూసిన అక్కడివారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. నీళ్ల చారు, పాడైపోయిన అన్నం, సరిగ్గా వేయించని రోటీ ఆ ప్లేట్లో ఉన్నాయి. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో.. పోలీసులకు యోగి ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన భోజనం అసలు గుట్టు ఇది.
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
పోలీసులకు బలవర్ధకమైన పోషకాహారం అందించడానికి వారి వేతనంతో పాటు అదనంగా రూ. 1,875ను ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారని మనోజ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, ఆచరణలో ఇది ఎంతమాత్రం ముందుకు సాగట్లేదని వాపోయాడు. యోగి హామీ బూటకమని మండిపడ్డారు. మెస్లో సర్వ్ చేస్తున్న ఆహారం నాణ్యతపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశానని, అయితే ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించాడు. ఫుడ్ నాణ్యత గురించి బయటకు చెప్తే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తామంటూ కొందరు అధికారులు తనను బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. మనోజ్ ఆరోపణలపై ఫిరోజాబాద్ పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆహారం నాణ్యతపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు వెల్లడించారు.