RSF | న్యూఢిల్లీ, మే 3: మీడియా స్వేచ్ఛ విషయంలో భారత్ పరిస్థితి దారుణంగా ఉన్నదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మరింత దిగజారాయని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (RSF) నివేదిక వెల్లడించింది. మీడియా స్వేచ్ఛలో భారత్ మరింత కిందికి పడిపోయిందని, 180 దేశాలకుగానూ 161వ స్థానంలో ఉన్నదని తెలిపింది. ఆర్ఎస్ఎఫ్ 21వ ఎడిషన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను బుధవారం విడుదల చేసింది. మీడియా స్వేచ్ఛలో తొలి మూడు స్థానాల్లో నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్ ఉన్నాయి. మీడియా స్వేచ్ఛలో భారత్ గత ఏడాది ర్యాంకింగ్స్తో పోలిస్తే ఈసారి 11 స్థానాలు దిగజారడం గమనార్హం. 2022లో విడుదల చేసిన మీడియా స్వేచ్ఛ ర్యాంకింగ్స్లో భారత్ 150వ స్థానంలో ఉన్నది.
జర్నలిస్టుల పరిస్థితి ‘తీవ్ర ఆందోళనకరం’గా ఉన్న 31 దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నదని ఆర్ఎస్ఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొన్నది. కాగా ఇందుకు పలు కారణాలను వెల్లడించింది. మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నాటి నుంచి జర్నలిస్టులపై హింస పెరిగిందని, మీడియాలో రాజకీయ పక్షపాతం, మీడియా యాజమాన్యాల తీరు కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్లో మీడియా స్వేచ్ఛ సంక్షోభంలో ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది.
అధికారంలో ఉన్నవారు జర్నలిస్టులను పలువిధాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని, దేశ ద్రోహం, క్రిమినల్ పరువు నష్టం వంటి కేసులు పెట్టిస్తున్నారని ఆర్ఎస్ఎఫ్ పేర్కొన్నది. కొంతమందినైతే దేశ వ్యతిరేకులుగా కూడా ముద్ర వేస్తున్నారని తెలిపింది. భారత్లో ప్రతి ఏడాది 3-4 జర్నలిస్టులు తమ కర్తవ్య నిర్వహణ విషయంలో హత్యకు గురవుతున్నారని పేర్కొన్న ఆర్ఎస్ఎఫ్.. మీడియాకు అతి ప్రమాదకరమైన దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటిగా అభివర్ణించింది. ఆన్లైన్ వేదికగా మహిళా జర్నలిస్టులపై వేధింపులు, జమ్ముకశ్మీర్లో మీడియా స్వేచ్ఛకు పోలీసుల విధిస్తున్న సంకెళ్ల విషయంపై కూడా నివేదిక చర్చించింది.
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఈ నివేదికను ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించింది. రాజకీయ, ఆర్థిక, లెజిస్లేటివ్, సామాజిక, భద్రత సూచీల ఆధారంగా మీడియా స్వేచ్ఛలో దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. భద్రత సూచీలో అయితే భారత్ ఏకంగా 172వ స్థానంలో ఉండటం గమనించాల్సిన అంశం. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే జర్నలిస్టులకు భద్రత కల్పించడంలో భారత్ ఎంత దారుణంగా ఉన్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.