న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి పెను విధ్వంసం సృష్టించింది. అన్ని రంగాలపై తన ప్రభావం చూపింది. ముఖ్యంగా విద్యారంగానికి భారీ నష్టాన్ని కలిగించింది. ప్రపంచ మహమ్మారితో ప్రస్తుత తరం విద్యార్థులు తమ జీవన సంపాదనలో 17 ట్రిలియన్ల అమెరికా డాలర్ల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇది మొత్తం ప్రపంచ జీడీపీలో 14శాతం. ఇందుకు సంబంధించిన డేటాను ప్రపంచ బ్యాంకు, యూనెస్కో నివేదికను ప్రచురించాయి.
ఇందులో కరోనా మహమ్మారి సమయంలో పాఠశాలలను మూసివేయడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. ఈ నివేదికకు ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ఎడ్యుకేషన్ క్రైసిస్.. ఏ పాత్ టు రికవరీ రిపోర్ట్’ అని పేరు పెట్టారు. పాఠశాలలపై కరోనా ప్రభావం ఊహించినదాని కంటే భారీగానే ఉందని నిపుణులు పేర్కొన్నారు. పది ట్రిలియన్ల అమెరిక్ డాలర్ల కంటే చాలా ఎక్కువ. మధ్య, తక్కువ ఆదాయ దేశాల్లో 53శాతం మంది విద్య కోసం పోరాడుతున్నారని నివేదిక పేర్కొంది. ఇప్పుడు కొవిడ్ మహమ్మారి కారణంగా బడులు మూతడిన తర్వాత ఇది 70 శాతానికి పెరుగనున్నది.
భవిష్యత్పై ప్రతికూల ప్రభావం
ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జామీ సావేద్రా మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు పడడం ప్రపంచవ్యాప్తంగా విద్యావేగం తగ్గింది. మహమ్మారితో దాదాపు 21 నెలల తర్వాత కూడా చాలా పాఠశాలలు మూతపడే ఉన్నాయి. లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉన్నారు. చాలా మంది మళ్లీ పాఠశాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పిల్లలకు జరిగిన నష్టాన్ని అంగీకరించలేం. ఇది వారి భవిష్యత్లో ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మహమ్మారి ఈ తరం ఉత్పాదకత, సంపాదన, జీవన స్థితిగతులపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది కుటుంబానికి కాదు మొత్తం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హానికరం’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్యాకేజీలో విద్యకు 3శాతం కంటే తక్కువ కేటాయింపులు..
కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ప్రభుత్వాలు ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో మూడు శాతం కంటే తక్కువ విద్య కోసం కేటాయించారు. అయితే, ప్రస్తుత సమయంలో దీని కంటే ఎక్కువ అవసరమని నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు విద్యార్థులు తమ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని, దీంతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నివేదిక పేర్కొంది.