న్యూఢిల్లీ, నవంబర్ 29: అదనపు పనిగంటలు మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. వారానికి 55 గంటలకు మించి పనిచేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) సంచలన నివేదికను బయటపెట్టింది. 2016 గణాంకాల ప్రకారం.. అధిక పని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 29.6 లక్షల మంది మరణిస్తుండగా వీరిలో అత్యధికులు అదనపు పనిగంటల కారణంగా చనిపోతున్నారు.
మొత్తం మరణాల్లో 20.6 లక్షల మంది ఉపాధి కారణంగా వచ్చే వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతుండగా, మిగతా 3.3 లక్షల మంది పని ప్రమాదాల కారణంగా చనిపోతున్నారు. అతిపెద్ద కిల్లర్ మాత్రం అధిక పనిగంటలేనని నివేదిక స్పష్టం చేసింది. వారానికి 55 గంటలకు మించి పనిచేయడం వల్ల ఏటా 7,44,942 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు చెప్పుకొచ్చింది.
ఇక, వాయువుల కారణంగా 4.5 లక్షల మంది, పని ప్రమాదాల కారణంగా 3,63,283 మంది, ఆస్బెస్టాస్ వల్ల 2,09,481 మంది, సిలికా వల్ల 42,258 మంది, ఆస్తమాకు కారణమయ్యే పదార్థాల వల్ల 29,641 మంది, సోలార్ అల్ట్రావయలెట్ రేడియేషన్ కారణంగా 17,936 మంది, డీజిల్ ఇంజిన్ పొగ కారణంగా 14,728 మంది, ఆర్సెనిక్ వల్ల 7,598 మంది, నికెల్ వల్ల 7,301 మంది చనిపోయినట్టు వివరించింది. వృత్తిపరమైన కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్ల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారు.