న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 8 నెలలుగా పోరాడుతున్న రైతులు కేంద్రంలోని అధికార బీజేపీకి మరో హెచ్చరిక జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్ట్ 15న జాతీయ జెండాను బీజేపీ నేతలు, మంత్రులు ఎగురవేయకుండా అడ్డుకుంటామని తెలిపారు. అలాగే హర్యానా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహిస్తామని, బీజేపీ నేతలకు నల్ల జెండాలు చూపుతామని అన్నారు. తమ చర్య జాతీయ జెండాను అవమానించడానికి కాదని, త్రివర్ణ పతాకాన్ని ఎగురనీయకుండా బీజేపీ నేతలను అడ్డుకోవడమేనని హర్యానాకు చెందిన రైతులు తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్ట్ 15న భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి.