Aravalli Range : ఆరావళి పర్వతాల్ని తాకడానికి కూడా అనుమతించబోమని భారత సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఆరావళి పర్వతాల పరిధిలో జూ సఫారి ఏర్పాటు చేయాలనే హర్యానా ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు వ్యతిరేకించింది. అక్కడ ఎలాంటి చర్యలకు అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఆరావళి పర్వాతాల పరిధిలో జూ సఫారి ఏర్పాటు చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది.
దీన్ని వ్యతిరేకిస్తూ ‘పీపల్స్ ఫర్ ఆరావళిస్’ అనే స్వచ్ఛంద సంస్థ గత ఏడాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది. ఆరావళి పరిధిలో, గుర్గావ్-నుహ్ జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతంలో జూ సఫారి ఏర్పాటుపై కోర్టుకు హర్యానా ప్రభుత్వం డీపీఆర్ సమర్పించింది. అంతేకాదు.. గతంలో అనుకున్నట్లుగా 10,000 ఎకరాల్లో కాకుండా 3,300 ఎకరాల్లోనే పార్క్ ఏర్పాటు చేస్తామని కోర్టుకు తెలిపింది. ఇందుకు అనుమతివ్వాలని కోరింది. అయినప్పటికీ, తాము ఇప్పటికి అనుమతులు మాత్రం ఇవ్వబోమని కోర్టు చెప్పింది. ఆరావళిని తాకనివ్వబోమని తేల్చింది.
అంతేకాదు.. ఈ అంశంపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, శాస్త్రీయ అంశాలతో పూర్తిస్థాయి నివేదిక అందిస్తే అప్పుడు పరిశీలిస్తామని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తామేమీ నిపుణులం కాదని, అందుకే స్వతంత్ర సంస్థ అందించే సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతానికి అంగుళం కూడా ఆరావళి పర్వతాల్ని తాకేందుకు అనుమతివ్వబోమని చెప్పింది. మరోవైపు ఆరావళి పర్వతాల్ని రక్షించాలనే ఉద్యమం దేశవ్యాప్తంగా నడుస్తోంది.