ముంబై : ఉదయం అల్పాహారం నిమిత్తం ఓ మహిళ కిచిడి వండింది. అయితే అందులో కాస్త ఉప్పు ఎక్కువైంది. అల్పాహారంలో ఉప్పు ఎక్కువైందని ఆగ్రహంతో ఉన్న భర్త.. భార్యను చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని భయాండర్ టౌన్షిప్లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నీలేష్ గాగ్(46), నిర్మల(40) అనే ఇద్దరు దంపతులు భయాండర్ టౌన్షిప్లోని పఠాక్ రోడ్డులో నివాసముంటున్నారు. అయితే నిర్మల శుక్రవారం ఉదయం అల్పాహారంలో భాగంగా కిచిడి వండింది. తన భర్తకు ఉదయం 9:30 గంటల సమయంలో నిర్మల కిచిడి వడ్డించింది. కిచిడి రుచి చూసిన భర్తకు క్షణాల్లోనే కోపం కట్టలు తెంచుకుంది. ఆ ఆహారంలో ఉప్పు ఎక్కువైందని భార్యను మందలించాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతుకు బట్ట చుట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.