Encounter | రాంచీ: శుక్రవారం రాత్రి.. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా, హుస్సిపీ అటవీ ప్రాంతం.. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్.. తుపాకుల మోతతో అడవి అంతా దద్దరిల్లింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే సహచర మావోయిస్టులు అతన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. భద్రతా సిబ్బందికి గాయాల బాధతో మూలుగుతున్న మావోయిస్టు కనిపించగా వెంటనే అతడిని భుజాలపైకి ఎత్తుకుని, ఐదు కిలోమీటర్లు అడవిలో నడిచి ప్రాణదానం చేశారు.
అతడి పట్ల పోలీసులు చూపిన మానవత, ఔదార్యంపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. గత శుక్రవారం పోలీసులు యాంటీ మావోయిస్టు ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గాయపడిన మావోయిస్టును భద్రతా సిబ్బంది భుజానికెత్తుకుని ఐదు కిలోమీటర్లు నడిచి హాత్తిబురు క్యాంపునకు చేర్చారు. దారిలో మావోయిస్టులు పాతిపెట్టిన ఐఈడీలు ఉంటాయని తెలిసి కూడా ఆ పోలీసులు తమ ప్రాణాలకు తెగించి ప్రాణదాతలుగా మారారు. క్యాంపు వైద్యులు క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం శనివారం హెలికాప్టర్లో రాంచీలోని దవాఖానకు తరలించినట్టు పోలీసు శాఖ తెలిపింది.