Greater Noida : వరకట్న వేధింపులు భరించలేక గ్రేటర్ నోయిడా పరిధిలో 24 ఏళ్ల వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని దీపికగా గుర్తించారు. పోలీసులు, వివాహిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పురాకు చెందిన దీపిక అనే యువతికి హృతిక్ అనే వ్యక్తితో ఏడాది క్రితం వివాహం జరిగింది.
పెళ్లి సందర్భంగా కట్న కానుకలు, ఇతర లాంఛనాలు, ఖర్చులు అన్నీ కలిపి దీపిక కుటుంబం రూ.1 కోటి వరకు ఖర్చు చేసింది. అయితే, పెళ్లైన తర్వాత నుంచి భర్త, అతడి కుటుంబ సభ్యులు దీపికను తీవ్ర వేధింపులకు గురి చేశారు. శారీరకంగా, మానసికంగా హింసించారు. అదనపు వరకట్నం కోసం వేధించారు. ఈ అంశంపై దీపిక తండ్రి మట్లాడుతూ.. ఆమె భర్త, కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా వేధించేవారని తెలిపారు. ఈ అంశంపై గత రాత్రి వారి ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చినట్లు తెలిపాడు. అయితే, ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే దీపిక గాయపడి, స్పృహ తప్పి పడిపోయిందని వారికి ఫోన్ వచ్చింది. దీంతో ఆస్పత్రికి చేరుకునే సరికే దీపిక చనిపోయందని తెలిపారు.
అయితే, తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయని తండ్రి చెప్పాడు. తమకు సాధ్యమైనంతగా వారికి అప్పజెప్పామని, కానీ, వారు మాత్రం తమ కూతురును వేధించారని తండ్రి ఆవేదనతో అన్నాడు. తన కూతురును చంపిన హృతిక్ కుటుంబ సభ్యుల్ని ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దీపిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను, మామను అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని, తగిన ఆధారాలు సేకరిస్తున్నామన్నారు.