జబల్పూర్: మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. తిల్వారా పోలీస్స్టేషన్ ఏరియాలోని మేఖ్లా రిసార్టులో ఓ 22 ఏండ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలను నిందితుడు వీడియో తీసి, మృతురాలి ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశాడు.
తాను, తన పార్ట్నర్ కలిసి బీహార్ రాజధాని పట్నాలో వ్యాపారం చేస్తున్నామని, అక్కడ తమ ఇద్దరికి ఓ యువతితో వివాహేతర సంబంధం ఏర్పడిందని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే యువతి తన వ్యాపార భాగస్వామి నుంచి బాగా డబ్బులు గుంజడం మొదలుపెట్టిందని అతడు వెల్లడించాడు.
యువతి జబల్పూర్కు పారిపోయే వరకు మొత్తం రూ.12 లక్షలకు పైగా వసూలు చేసిందని పేర్కొన్నాడు. దాంతో తన వ్యాపార భాగస్వామి ఆమెను హతమార్చాలని తనకు చెప్పాడని, అందుకే తాను ఆమెను హత్య చేశానని చెప్పాడు. ఈ హత్యలో తమ ఇద్దరికీ ప్రమేయం ఉందని పేర్కొన్నాడు. దాంతోపాటు యువతి రక్తపు మడుగులో పడివున్న వీడియోను కూడా అతడు పోస్ట్ చేశాడు, కానీ కాసేపటికే ఆ వీడియోను డిలీట్ చేశాడు.
సీసీ ఫుటేజ్ పరిశీలించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఈ నెల 6న మేఖ్లా రిసార్టులో రూమ్ బుక్ చేశాడు. 7న మధ్యాహ్నం యువతి అతడి గదికి వచ్చింది. ఆ తర్వాత తినడానికి ఏదో ఆర్డర్ చేశారు. ఆపై ఓ గంట సేపటికి నిందితుడు హోటల్ రూమ్కు తాళం వేసి వెళ్లిపోయాడు. 8న మధ్యాహ్నం అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది గది తాళం విరగ్గొట్టి చూడగా.. యువతి రక్తపు మడుగులో విగతజీవిగా పడివుంది.
హోటల్ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. నిందితుల జాడ కనిపెట్టి అరెస్ట్ చేశారు.