ముంబై : చిరుత పులిని చూస్తేనే శరీరంలో వణుకు పుడుతోంది. అలాంటి చిరుత ఓ వృద్ధురాలిపై దాడి చేయబోగా, ఆమె చాకచక్యంతో దాన్ని తప్పించుకుంది. స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది వృద్ధురాలు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అరేయ్ డెయిరీ ఏరియాలో నిర్మలా దేవీ సింగ్(55) అనే వృద్ధురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. సెప్టెంబర్ 29న రాత్రి 7:47 గంటల సమయంలో తమ ఇంటి ముందు ఆమె కూర్చుంది. కొంచెం దూరంలో ఉన్న చిరుత నిర్మలా దేవీని చూసి.. ఆమె దగ్గరకు వచ్చి దాడికి యత్నించింది.
అప్రమత్తమైన వృద్ధురాలు.. తన వాకింగ్ స్టిక్తో చిరుతపై దాడి చేసింది. వృద్ధురాలి కాలును చిరుత లాగబోతుండగా.. దాని ముఖంపై కర్రతో దాడి చేయడంతో భయపడి అది తప్పించుకుంది. నిర్మల గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగెత్తుకు వచ్చారు. చిరుత దాడిలో గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిర్మలా దేవీ ముఖం, కాలికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.