ఆగ్రా: అది బీజేపీ పాలిత యూపీలోని ఆగ్రా. జిల్లాలోని ధనోలీ, అజీజ్పురా, సిరోలీ అనే మూడు గ్రామాల్లో సరైన రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. రోడ్లపై మురుగునీటితో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులకు ఏండ్లుగా గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఇక చేసేదేం లేక సమస్యలు తీర్చాలంటూ మూడు గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానైనా తమ గోడును ప్రభుత్వం వినిపించుకుంటుందేమో అన్న ఆశతో.. దీక్షకు దిగారు. రోడ్డుపై ఉన్న గుంతల్లో, బురద నీటిలోనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 81 రోజులుగా 3 గ్రామా ల ప్రజలు ధర్నా చేస్తున్నారు. అయినా ప్రభుత్వం కనికరించలేదు. ఈ క్రమంలో సోమవారం దీక్షా స్థలంలో రాణీదేవి, కీర్తిదేవి అనే ఇద్దరు మహిళలు కుప్పుకూలారు. వారిని దవాఖానకు తరలించగా, రాణీదేవి అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కీర్తిదేవి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.