రాయ్పూర్: ఒక మహిళ అడవి పంది (wild boar) దాడి నుంచి తన కుమార్తెను కాపాడుకుంది. అయితే అడవి పందితో పోరాడే క్రమంలో ఆమె మరణించింది. ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలియమార్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల దువాషియా బాయి, ఆదివారం 11 ఏళ్ల కుమార్తెతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో మట్టి తీసే పనులు చేస్తుండగా అక్కడకు ఒక అడవి పంది వచ్చింది. ఆమె కుమార్తెపై అది దాడి చేయబోయింది. గమనించిన దువాషియా బాయి వెంటనే తన చేతిలో ఉన్న గొడ్డలితో ప్రతిఘటించింది. ఆ అడవి పందితో తీవ్రంగా పోరాడింది. దీంతో అది చనిపోయింది.
కాగా, అడవి పందితో పోరాటంలో తీవ్రంగా గాయపడిన దువాషియా బాయి కూడా చనిపోయింది. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రూర మృగాల దాడి కింద బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని పాసన్ అటవీ రేంజ్ అధికారి రామ్నివాస్ దహయత్ తెలిపారు. తాత్కాలిక ఉపశమనం కింద తొలుత రూ.25,000 చెల్లిస్తామని, అన్ని ఫార్మాటీలు ముగిసిన అనంతరం మిగతా రూ.5.75 లక్షలు అందజేస్తామని వెల్లడించారు.