లక్నో : మూడు ముళ్లు వేసే సమయానికి పెళ్లి మండపంలో ఉండాల్సిన వరుడు.. వేదిక ద్వారం వద్ద మద్యం మత్తులో తూలుతున్నాడు. విషయాన్ని గమనించిన వధువు తక్షణమే ఈ పెళ్లి తనకు వద్దని విరమించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వెలుగు చూసింది. రవీంద్ర పటేల్తో ఓ రైతు తన బిడ్డ వివాహాన్ని కుదిర్చాడు.
అయితే ముహుర్తం సమయం కంటే ముందు వధూవరులు కలిసి వేదిక వద్దకు వస్తున్న సమయంలో.. వరుడు తన స్నేహితులతో కలిసి పీకల దాకా మద్యం సేవించాడు. వధువుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో తనకు ఈ పెళ్లి వద్దని, తాము ఇచ్చిన కట్నం, ఆభరణాలు తిరిగి ఇవ్వాలని వధువు డిమాండ్ చేసింది. ఇందుకు వరుడి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మొత్తానికి పోలీసుల జోక్యంతో కట్నకానుకలు వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చారు. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది.