న్యూఢిల్లీ: రాజ్యాంగ సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ బండా ప్రకాశ్ ( Banda Prakash ) మాట్లాడారు. అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం డిమాండ్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ విధించడం వల్ల అది ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఏ డేటా ఆధారంగా 50 శాతం రిజర్వేషన్ కాల్పించాలని సుప్రీం నిర్ణయించిందన్నారు. దానికి శాస్త్రీయ ఆధారం ఏమి ఉందని ఆయన ప్రశ్నించారు.
1931 నుంచి దేశంలో జనాభా గణన జరుగుతోందని, కానీ 2011 లెక్కల్ని ఇంత వరకు ప్రకటించలేదన్నారు. ఓబీసీ జనాభాను కూడా లెక్కించాలని ఎంపీ బండా ప్రకాశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎటువంటి డేటా లేకుండా అసలు కార్యక్రమాలు ఎలా చేపడుతారని ఆయన అడిగారు. ఐఐటీలు, ఐఐఎంలు లాంటి ఉన్నత విద్యాసంస్థల్లో డేటా లేని కారణంగా ఉల్లంఘనలు జరుగుతున్నట్లు ఎంపీ ప్రకాశ్ అన్నారు. ఎస్బీఐ, ఆర్బీఐ లాంటి వాటిల్లోనూ రిజర్వేషన్ల అమలు సరిగా లేదన్నారు.
శాసనసభల్లోనూ రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. శాసనసభలో 33 శాతం ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానించిందని, ఆ తీర్మానాన్ని 8 ఏళ్ల క్రితం ఢిల్లీలోకి పంపామని, కానీ ఇంకా దానిపై నిర్ణయం జరగలేదని ఎంపీ బండా ప్రకాశ్ చెప్పారు. లోక్సభ, రాజ్యసభల్లో ఎంత మంది ఓబీసీ సభ్యులు ఉన్నారో పరిశీలించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. శాసనసభ, పార్లమెంట్లో రాజకీయ రిజర్వేషన్ల అంశాన్ని నిర్ణయించాలని కోరారు.
ఓబీసీల్లో క్రీమీలేయర్ ఎక్కడ ఉందని ఎంపీ ప్రకాశ్ ప్రశ్నించారు. క్రీమీలేయర్ ఎలా పుట్టిందని ఆయన అడిగారు. క్రీమీలేయర్ గురించి రాజ్యాంగంలో ఉందా అని ఆయన నిలదీశారు. ఒకవేళ క్రీమీలేయర్ అంటూ ఉంటూ.. దాన్ని జనరల్ క్యాటగిరీలో కూడా తీసుకురావాలని కోరారు. వెనుకబడిన తరగతుల కోసం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో 60 కోట్ల మంది ఓబీసీలు ఉన్నారని, వారి అభివృద్ధి జరగకుండా.. దేశం అభివృద్ధి కాదన్నారు.