ముంబై, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 65 ఏండ్ల చవాన్కు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో సాదర స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో సహా కీలక నేతలు చవాన్కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఇదో కొత్త దశ అని చవాన్ పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉన్న చవాన్ ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకున్నారు.
అశోక్ చవాన్కు రాజ్యసభ సీటు ఇస్తారనే ఊహాగానాల మధ్య ఆయన బీజేపీ గూటికి చేరుకోవటం గమనార్హం. బుధవారం ఆయన రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. బీజేపీ అశోక్ చవాన్ను రాజ్యసభకు పంపినట్టయితే అది అమరవీరులైన సైనికులను అవమానించినట్టేనని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. అయితే తన 38 ఏండ్ల రాజకీయ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి.. కొన్ని మంచి పనులు చేయాలని, ప్రగతిశీల ఆలోచనలతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్టు అశోక్ చవాన్ వెల్లడించారు.