CAA | కోల్కతా, జనవరి 29: త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న వేళ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వారం రోజుల్లో సీఏఏను దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేస్తామని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శాంతనూ ఠాకూర్ సంచలన ప్రకటన చేశారు. పశ్చిమబెంగాల్లోని బంగాన్ లోక్సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్న శాంతనూ.. ఆదివారం సాయంత్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కాక్ద్వీప్లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ‘అయోధ్యలో రామమందిరం ప్రారంభం అయింది. అలాగే వారం రోజుల్లో పశ్చిమబెంగాల్తో సహా దేశవ్యాప్తంగా సీఏఏను అమలు చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న రాష్ట్రంలోని అధికార టీఎంసీని లక్ష్యంగా చేసుకొని ఈ సందర్భంగా ఆయన విమర్శలు చేశారు.
ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నవారు ఈ దేశ పౌరులని, ఓట్లు వేయొచ్చని టీఎంసీ ప్రభుత్వం చెబుతున్నదని, అయితే ఇక్కడ ఉన్న వేలాది మంది పౌరులకు ఓటు హక్కు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. దీనికి సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు తరాలను కాపాడేందుకు సీఏఏను అమలు చేయాల్సిన అవశ్యకత ఉన్నదని నొక్కిచెప్పారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆదివారం సభలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. ‘సీఏఏ వారం రోజుల్లో కచ్చితంగా అమలవుతుంది. ఇది నా గ్యారెంటీ’ అని పునరుద్ఘాటించారు. బంగాన్ లోక్సభ నియోజకవర్గంలో మథువా కమ్యూనిటీ ప్రజలు అధికంగా ఉంటారు. ఆ కమ్యూనిటీలో శాంతనూ ఠాకూర్ ప్రముఖ నేతగా ఉన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ సీఏఏ చట్టం నిబంధనలను లోక్సభ ఎన్నికలకు ముందే నోటిఫై చేసే అవకాశం ఉన్నదని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి శాంతనూ తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత డిసెంబర్లో కోల్కతాలో నిర్వహించిన బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ సీఏఏ అమలు అనివార్యమని అన్నారు. సీఏఏ అంశంపై మమత ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు.
కేంద్ర మంత్రి శాంతనూ వ్యాఖ్యలను టీఎంసీ కొట్టిపారేసింది. ఆయన ప్రకటన కేవలం ఎన్నికల జిమ్మిక్కు అని పేర్కొన్నది. రాష్ట్రంలో సీఏఏ అమలును అడ్డుకొని తీరుతామని స్పష్టం చేసింది. కూచ్బెహర్లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మమత మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ సీఏఏ అంశాన్ని లేవనెత్తుతున్నదని విమర్శించారు. ఎన్నికలకు ముందు మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అయితే ఠాకూర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ నిరాకరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పగలదని అన్నారు. లోక్సభ ఎన్నికలలోగానే సీఏఏ నిబంధనలు రూపొందిస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2019, డిసెంబర్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపచేసుకొన్నది. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ నుంచి భారత్కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్ మతస్తులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే 1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా ఈశాన్య రాష్ర్టాల్లో పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. అయితే సీఏఏకు సంబంధించిన నిబంధనలు ఇప్పటి వరకు ఖరారు కాలేదు. రూల్స్ రూపకల్పన విషయంలో 2020 నుంచి కేంద్ర హోంశాఖ వాయిదాలు వేసుకొంటూ వస్తున్నది.