పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ప్రయోగాలకు దిగొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, ఈ ప్రశాంత వాతావరణం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఆయన ప్రకటించారు. పంజాబ్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గురుదాస్ పూర్, హోశీర్పూర్ ప్రాంతాల్ఓ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్ వాతావరణాన్ని, సంస్కృతిని తమ పార్టీ పూర్తిగా ఆకళింపు చేసుకుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమనే ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. నిరుద్యోగిత రాను రాను తీవ్రంగా పెరిగిపోతున్నా, ప్రధాని మోదీ మాత్రం ఈ విషయంపై మాట్లాడరని, నల్లధన విషయంపై కూడా స్పష్టతనివ్వని విమర్శించారు.
ఇతరుల్లాగా తప్పుడు హామీలివ్వం…
ఇతర పార్టీల్లాగా తాము తప్పుడు హామీలిచ్చి, ప్రజలను మోసగించమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను కేవలం నిజాలే మాట్లాడతానని, అబద్ధాలు వినాలనుకుంటే మాత్రం ప్రధాని మోదీ, సీఎం కేజ్రీవాల్ మాటలు వినాలని రాహుల్ ఎద్దేవా చేశారు. తాము గనక అధికారంలోకి వస్తే పంజాబ్ను వేధిస్తోన్న డ్రగ్స్ సమస్యను రూపుమాపేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.