ముంబై: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. (MVA Defeat) మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా దాటలేదు. ఈ కూటమి 45 స్థానాల్లో విజయం సాధించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 15, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు గెలిచాయి.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం మొత్తం 288 సీట్లలో 10 శాతం లేదా 29 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే ఎంవీఏలోని ఏ పార్టీ కూడా ఆ మేరకు సీట్లు గెలువలేదు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి ఏ పార్టీ కూడా అర్హత సాధించలేదు. ఈ నేపథ్యంలో ఎంవీఏ కూటమి ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. అలాగే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తమ నిజమైన పార్టీల ఉనికిని కూడా కోల్పోయాయి.