ముంబై: బరువెక్కిన హృదయంతోనే శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేను (Eknath Shinde) ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు. తాము సీఎం పదవి కోల్పోవడం తమకు ఇష్టం లేదని, అయినా పార్టీ అధినాయకత్వం ఆదేశాలమేరకు దేవేంద్ర ఫడ్నవీస్ బదులు ఏక్నాథ్కు మద్దతు ఇవ్వడానికి ఒప్పున్నామని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం అందించడం, ప్రజలకు సరైన సందేశాన్ని అందిచండానికే తామీ నిర్ణయం తీసుకున్నామని పాటిల్ వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం పట్ల తాము ఏమాత్రం సంతోషంగా లేమని పేర్కొన్నారు.
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూలదోసి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీనికోసం శివసేనలోని ఏక్నాథ్ షిండేను పావుగా వాడుకున్న విషయం తెలిసిందే. ఏక్నాథ్ నేతృత్వంలో పార్టీని చీల్చి ప్రభుత్వం మైనార్టీలో పడేలా చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితిల్లో ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా శివసేన నుంచి థాక్రేలను వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.