న్యూఢిల్లీ: శీతాకాలం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత చల్లని వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ (Power Demand) అత్యధిక గరిష్ఠానికి చేరింది. రోజువారీ విద్యుత్ వినియోగం 5,798 మెగా వాట్లకు (ఎంవీ) పెరిగింది. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఢిల్లీలో శుక్రవారం ఉదయం 10:20 గంటలకు విద్యుత్ డిమాండ్ 5,798 మెగా వాట్లకు చేరుకుంది. జనవరి 17న 5,726 మెగా వాట్లు, 12న 5,701 మెగా వాట్ల గరిష్ఠ డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 5,700 మెగా వాట్ల మార్కు దాటడం ఈ నెలలో మూడోసారి అని వెల్లడించారు.
కాగా, ఈ శీతాకాలంలో ఢిల్లీలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 5,760 మెగా వాట్లకు చేరుతుందని డిస్కమ్లు ముందుగానే అంచనా వేశాయి. ఉత్తర ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ 1,779.04 మెగావాట్లకు చేరిందని టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ తెలిపింది. ఈ శీతాకాలంలో గరిష్ట డిమాండ్ 1,800 మెగావాట్లకు చేరుకుంటుందని ఆ కంపెనీ అంచనా వేసింది. అలాగే బీఎస్ఈబీ రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్ కూడా 2,502, 1,215 మెగా వాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ను తీర్చాయి.