Eknath Shinde : తాను త్వరలోనే అయోధ్యను కచ్చితంగా సందర్శిస్తానని, రాముడికి పూజలు చేస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. అయితే.. ఏరోజు వెళ్తారు అనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. నాగ్పూర్లో మంగళవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. అయోధ్య నుంచి కొంతమంది మత పెద్దలు సోమవారం నన్ను కలిశారు. అయోధ్యకు వచ్చి రాముడిని దర్శించుకోవాల్సిందిగా కోరారు. నేను త్వరలోనే కచ్చితంగా అక్కడికి వెళ్తాను. అయోధ్య అనేది పవిత్రమైన స్థలం. మనందరం ఆరాధించే ప్రదేశం అని షిండే తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరంపై సుప్రీం కోర్టు 2019 తుది తీర్పు వెలువరించింది. దాంతో అక్కడ రాముడికి మందిరం నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 2020లో భూమి పూజ చేశారు. దాంతో, ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర 20వ సీఎంగా 2022 జూన్ 30 తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. శివసేనలో కీలక నేత అయిన ఆయన బీజేపీతో చేతులు కలిపిప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. దాంతో, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం రద్దయ్యింది. అయితే.. గత కొన్నిరోజులుగా బీజేపీ నాయకులు షిండే సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనను తొలగించి దేవేంద్ర ఫడ్నవీస్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.