బీజేపీ శాసనసభా పక్షనేత సుబేందు అధికారి తిరిగి తృణమూల్లో చేరుతున్నారా? బీజేపీలో ఇమడలేకపోతున్నారా?…. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే సుబేందు అధికారి తిరిగి తృణమూల్లో చేరడానికి సిద్ధపడిపోయారని, బీజేపీలో ఆయన ఇమడలేకపోతున్నారని తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ వ్యాఖ్యానించారు. అయితే తాము ఆయన్ను తిరిగి పార్టీలోకి తీసుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేమని కునాల్ ఘోష్ స్పష్టం చేశారు. బీజేపీలో చేరిన తర్వాత తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు.
బీజేపీలో చేరిన తర్వాత ఆయన కన్న కలలన్నీ కల్లలైపోయాయని, మానసికంగా దెబ్బతిన్నారని కునాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మానసిక దెబ్బతిన్న కారణంగానే తమ పార్టీ నేతలపై విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. అతి కొద్ది రోజుల్లోనే సుబేందు అధికారితో సహా మరో ముగ్గురు తిరిగి తృణమూల్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారన్న సమాచారం తమకు అందిందని, కానీ.. వారికి తృణమూల్ తలుపులు తెరుచుకోవని కునాల్ ఘోష్ కుండబద్దలు కొట్టారు.