మంథని గడ్డపై నుంచే పీవీ రాజకీయ ఓనమాలు
1957లో ఎమ్మెల్యేగా తొలివిజయం
వరుసగా నాలుగు సార్లు గెలుపు
మంత్రిగా, ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం
ఇక్కడి ప్రజలతో విడదీయలేని అనుబంధం
నేడు శతజయంతి
కరీంనగర్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పెద్దపల్లి, (నమస్తే తెలంగాణ) : వరంగల్ జిల్లా నర్సంపేట లక్నెపూర్ గ్రామంలోని రుక్నాబాయి సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. పీవీ వరంగల్ జిల్లాలోనే తన ప్రాథమిక విద్యను మొదలు పెట్టారు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి పాములమూర్తి రంగారావు, రుక్మిణమ్మ ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. ఆయన పుట్టింది లక్నెపూర్లో అయితే పెరిగింది వంగరలో కానీ ఆయనకు రాజకీయంగా పుర్జన్మనిచ్చింది మాత్రం అలనాటి మంత్రపురి నేటి మంథని.
నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరించిన పీవీ..
1938లో హైదరాబాద్లోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరిన నిజాం ప్రభుత్వ నిషేధాన్ని దిక్కరిస్తూ వందేమాతరం గీతాన్ని పాడారు. దీంతో పీవీ నరసింహారావును తాను చదివే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించారు. ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులోనే ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుంచి 1944 వరకు ఎల్ఎల్బీని పూర్తి చేశారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుతో కలిసి స్వాతంత్రోద్యమంలోను, హైదరాబాద్ విముక్తి పోరాటంలో పీవీ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువజన కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్తో కలిసి పని చేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యత్వం తీసుకున్నారు. పీవీ నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతం వరకూ కథనాలను రాశారు.
మంథని నుంచే రాజకీయ ప్రస్థానం..
కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న పీవీకి తొలుత 1952లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. తొలి ఎన్నికలో కలిసి రాక పరాజయం పాలయ్యారు. ఆతర్వాత 1957లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గులుకోట శ్రీరా ములు కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి మంథని నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం ఆశించారు. ఆయనకు పోటీగా జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘునాథ్కాచే సైతం కాంగ్రెస్ టికెట్ తనకే కావాలని పట్టుబట్టారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉద్ధ్దండులు కావడం.. ఒకరికి ఇస్తే.. మరొకరితో ఇబ్బంది అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మధ్యే మార్గంగా పీవీ పేరును తెరమీదకు తెచ్చింది. వారిద్దరి సామాజిక వర్గానికే చెందిన పీవీకి స్థానికంగా ఉన్న ఆ సామాజిక వర్గ ప్రజలు మద్దతు పలకడంతో తొలిసారిగా పీవీకీ 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించింది. మంథని ఎమ్మెల్యేగా విద్య, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా, ఏకంగా ముఖ్యమంత్రిగా పని చేసే అవకా శం దక్కింది. వేదాలకు మేధావులకు నిలయమైన మంథని నియోజకవర్గం నుంచి 1957, 1962, 1967, 1972లో నాల్గు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు నెలకొల్పారు. ఆయన తన రాజకీయ చతురతను చాటుకుంటూ నాల్గు సార్లు గెలుపొంది రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆనంతరం ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన పీవీ ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఒక్కో అందలం ఎక్కుతూ చివరికి ప్రపంచమే కీర్తించే విధంగా భారత దేశ ప్రధానిగా తన పరిపాలన దక్షతను చాటారు.
భూసంస్కరణలకు శ్రీకారం..
ఒక వైపు రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. మంథని నుంచి ప్రాతినిధ్యం వహించిన పీవీ నర్సింహారావు మంథని ఎమ్మెల్యేగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ఎక్కడా లేని విధంగా భూ సంస్కరణల బిల్లును ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలను ఇరుకున పెట్టారు. 1972 ఆగస్టు 30న రాష్ట్ర శాసనసభలో భూసంస్కరణ బిల్లును ప్రవేశపెట్టి, భూస్వామ్య వ్యవస్థలో సమూల మార్పులకు బాటలు వేశారు. తెలంగాణలోని గ్రామాల్లో భూమి కోసం.. భుక్తి కోసం పోరాటాలు చేస్తున్న ఎర్ర జెండా పార్టీలే నివ్వెరపోయేలా చేశారు. ‘దున్నే వాడికే భూమి కావాలి’ అనే నక్సల్స్ నినాదాన్నే అందుకొని నినదించి కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. భూమి లేని పేదలు చిన్న చిన్న కమతాల యజమానులుగా మారడానికి దోహదపడ్డారు.
పీవీ హయాంలోనే ప్రగతి బాట
రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన మంథని నియోజకవర్గం 80శాతం వరకూ అటవీ ప్రాంతాన్ని కలిగి రాష్ట్రంలోనే అత్యంత విస్తీర్ణం కలిగిన నియోజకవర్గంగా ఉండేది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రహదారులు, వంతెనల నిర్మాణాలతోనే సాధ్యమవుతుందని భావించిన పీవీ ఆ దిశగా పనులు చేపట్టారు. ఒకవైపు గోదావరి, మరోవైపు మానేరు, వాగులు వంకలతో పచ్చని చెట్లతో పరిఢవిల్లే మంథని నియోజకవర్గానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కలగాలనే మంథని నియోజకవర్గం మధ్యలో నుంచి పారే మానేరు నదిపై మంథని మండలం అడవి సోమన్పల్లి వద్ద వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. మంథని పట్టణంలోని బొక్కలవాగుపై మరో వంతెన నిర్మాణాన్ని చేపట్టి రహదారులను నిర్మించారు. నియోజకవర్గంలోని మహాదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాలను కలుపుతూ ఇటు మంథని వరకు అటు వరంగల్ వరకు రహదారుల నిర్మాణం పీవీ హయాంలోనే జరిగాయి. మంథని, ముత్తారం, కమాన్పూర్ మండలాలను కలుపుతూ పెద్దపల్లి వరకు ప్రధాన రహదారి నిర్మాణం, మంథని-గోదావరిఖని రహదారి నిర్మాణాన్ని చేపట్టడంతో పాటుగా సింగిరెడ్డిపల్లి వద్ద వాగుపై మరో వంతెన నిర్మాణాన్ని సైతం ఆయన పూర్తి చేయించారు. ఇలా మంథని నియోజకవర్గ అభివృద్దికి పీవీ ఎమ్మెల్యేగా మంత్రిగా, ముఖ్యమంత్రిగా పునాదులు వేశారు. నియోజకవర్గంలోని మహాదేవపూర్, కాటారం, మహాముత్తారం మండలాల్లోని 64అటవీ ప్రాంత గ్రామాలను కలుపుతూ దాదాపు 20వంతెనలతో పీవీ నిర్మించతలపెట్టిన రింగు రోడ్డు నిర్మాణం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తయింది. పీవీ హయాంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల, దవాఖానాల నిర్మాణాలను పూర్తి చేశారు.
పులగం బోసిన ఊరికి పీవీ పేరు..
మంథని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తూనే నియోజకవర్గ అభివృద్ధిపై పీవీ ప్రత్యేక దృష్టిని సారించే వారు. ఈ క్రమంలో 1967లో నిర్మించిన మానేరు వంతెన నిర్మాణ సమయంలో అడవిసోమన్పల్లిని ఆనుకొని ఉన్న కొంత మంది ప్రజలు అవతలి ఒడ్డుకు వెళ్లి గృహాలను నిర్మించుకున్నారు. ఈ సమయంలో పీవి వారికి అండగా నిలవడంతో ఆ ఊరికి పులగం బోసింది పీవీనే కావడంతో ప్రజలంతా మూకుమ్మడిగా ఆ గ్రామానికి పీవీ నగర్గా నామకరణం చేసుకున్నారు. ఈ గ్రామం ప్రస్తుతం జయశంకర్భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండల పరిధిలో ఉంది.
చెక్కు చెదరని జ్ఞాపకం.. మానేరుపై వారధి
పీవీ పూర్వపు రెండు జిల్లాలైన కరీంనగర్-వరంగల్ను కలిపేందుకు 1964లో అధునాతనమైన స్ప్రింగ్ యాక్షన్ టెక్నాలజీతో భారీ వారధిని నిర్మించారు. 1970 డిసెంబర్ 20న దానిని ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణంతో మంథని నియోజకవర్గంలోని సగభాగం అటు, సగభాగం ఇటుగా ఉన్న మండలాలకు కనెక్టివిటీ పెరిగింది. పలు జిల్లాల ప్రజలకు ఈ వంతెన ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ వంతెన తర్వాత నిర్మించిన అనేక వంతెనలు శిథిలమై పోగా ఇది మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా పీవీ జ్ఞాపకంగా మిగిలింది.
స్వరాష్ట్రంలో గుర్తింపు..
పీవీ 2004 డిసెంబర్ 23న తన 83వ ఏటా మరణించారు. మరణానంతరం ఆయనను స్మరించుకోవడంలో కూడా కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జయంతి, వర్ధంతి రోజుల్లో కూడా ఇదే వివక్ష చూపారు. గల్లీ లీడర్లకు సైతం విగ్రహాలు పెట్టే నేతలు పీవీ విషయంలో ఏ మాత్రం స్పందించలేదు. కనీసం విగ్రహాలు కూడా ఆవిష్కరించుకోలేదు. కానీ, 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పీవీకి తగిన గుర్తింపు దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అరుదైన గౌరవం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు జయంతి వేడుకలను ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నారు. 2016 జూలైన 28న అప్పటి మంథని ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పట్టుబట్టీ మరీ మంథనిలో తొలి పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అప్పటి ఎంపీ కవితతో ఘనంగా ప్రారంభింపజేశారు.
నేడు పీవీ శతజయంతి..
ప్రభుత్వం పీవీ శతజయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నది. దీంతో సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దివంగత పీవీ శతజయంతి వేడుకలను ప్రభుత్వ అధికారులు, ప్రజలు నిర్వహించనున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో పీవీ విగ్రహం ఉండడంతో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.