Siddaramaiah | చావనైనా చస్తాగానీ బీజేపీలో చేరనని నిన్నటి నిన్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ తేల్చిచెప్పగా.. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరో విధంగా స్పందించారు. రాష్ట్రపతి పదవి గానీ, ప్రధాని పదవిగానీ ఆఫర్ చేసినా బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు.
మంగళవారం కర్ణాటకలోని మాగడిలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు సిద్దరామయ్య పాల్గొని ప్రసంగించారు. అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. అర్హత లేని వారే అధికారం కోసం చేతులు కలుపుతారన్నారు. తనను బీజేపీ హిందూ వ్యతిరేకి అని ట్యాగ్ చేసిందని, బీజేపీ ఎమ్మెల్యే ఒకరు నన్ను సిద్ధరాముల్లా ఖాన్ అని పిలుస్తున్నారని చెప్పారు. మహాత్మాగాంధీ నిజమైన హిందువు కానీ, గాడ్సేను ఆరాధించే వారిని నిజమైన హిందువులు అనొచ్చా అని సిద్దరామయ్య ప్రశ్నించారు. బీజేపీకి గౌరవం ఉన్నదా? అలాంటి వారితో పొత్తుపెట్టుకున్న పార్టీలకు కూడా గౌరవం లేదని సిద్దరామయ్య అన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అందరికీ ఆహార భద్రత కల్పించామని.. ఆ పనిని బీజేపీ చేయలేకపోయిందని దుయ్యబట్టారు. గతంలో ఇచ్చిన ఏడు కిలోల బియ్యాన్ని బీజేపీ ప్రభుత్వం ఐదు కిలోలకు తగ్గించిందన్నారు. కర్ణాటకలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతినెలా 10 కిలోల బియ్యంతో పాటు మహిళలకు రూ.2 వేలు అందిస్తామని చెప్పారు.