గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్కు పెద్ద షాకే తగిలేట్లు కనిపిస్తోంది. గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆయన గుజరాత్ నేతలపై బాహాటంగానే తీవ్ర విమర్శలు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. హఠాత్తుగా ఆయన హిందుత్వ బాణిని ఎత్తుకుంటున్నారు. తాను రామ భక్తుడ్ని అంటూ ప్రకటించుకున్నారు. తాను హిందువైనందుకు ఎంతో గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే.. తాను పార్టీ మారాలా? వద్దా; అన్నది మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నానని, బీజేపీలో మాత్రం చేరనని తేల్చి చెప్పారు.
హార్థిక్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఇక.. తన బాధ్యతలు నిర్వర్తించలేనని నిర్మొహమాటంగా చెప్పినట్లు సమాచారం. తాను ఏ పని చేయాలనుకున్నా… పార్టీలో కొందరు అడ్డుపుల్ల వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కారణంగానే తాను ప్రజల పక్షాన పోరాడలేక పోతున్నానని గుజరాత్ నేతలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష హోదాలో పోరాటం చేయలేకపోతే.. ప్రజలు ఇతర పక్షం వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందన్నారు. వైరి పక్షం చాలా బలంగా వుంందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనాలు వేయవద్దని కోరారు. అయితే.. కుటుంబ సభ్యుల్లో ఎవరితోనైనా గొడవలుంటే.. కుటుంబ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లే, తాను కూడా హైకమాండ్కు ఫిర్యాదు చేశానే తప్పించి, తనకు పార్టీ మారే ఆలోచన ఎంత మాత్రమూ లేదని హార్థిక్ పటేల్ పేర్కొన్నారు.