ముంబై: మీరు ప్రతిపక్షాలపై దృష్టి పెట్టబోతున్నట్లయితే, అది మనం చేయవలసిన పని కాదని మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. రాజకీయాలను దాటి వెళ్లడమే మనందరి పని అని శివసేన నేతలు, కార్యకర్తలతోపాటు ప్రతిపక్షాలకు సూచించారు. అంతా కలిసి ప్రజల వెనుక నిలబడాల్సిన సమయం ఇది అని వ్యాఖ్యానించారు. వరదల సమయంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే అడుగు బయటపెట్టలేదని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు విమర్శించడంపై ఆదిత్య ఠాక్రే ఈ మేరకు స్పందించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై దృష్టిపెట్టడం కాకుండా, ప్రజలకు సహాయ కార్యక్రమాలపై దృష్టిసారించాలని పార్టీ కేడర్కు సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలువాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. వర్షాలకు బాగా ప్రభావితమైన కొంకణ్, పశ్చిమ ప్రాంతాలలో నివసించే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కాగా, మహరాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో వంద మందికిపైగా మరణించగా సుమారు వంద మంది గల్లంతయ్యారు.