కోల్కతా : ప్రియుడితో పరారీ అయిన భార్యను పట్టిస్తే.. వారికి రూ. 5 వేలు నజరానా ఇస్తానని ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. భార్యతో పాటు కుమారుడిని కూడా వెంట పెట్టుకుని పోవడంతో బాధిత భర్త తీవ్ర ఆందోళనకు గురై ఈ ప్రకటన చేశాడు.
పశ్చిమ బెంగాల్లోని పింగ్లా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వృత్తిరీత్యా కార్పెంటర్. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అయితే డిసెంబర్ 9వ తేదీన ఇంట్లో భర్త లేని సమయంలో భార్య తన కొడుకును తీసుకుని పరారీ అయింది. భార్య, కుమారుడి ఆచూకీ కోసం బాధిత వ్యక్తి తెలిసిన వారందర్నీ వాకబు చేశాడు. ఎలాంటి ఆచూకీ లభించలేదు. చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య, కుమారుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 5 వేల నజరానా ఇస్తానని సోషల్ మీడియాలో ప్రకటించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. డిసెంబర్ 9వ తేదీన రాత్రి బాధితుడి భార్య, కుమారుడు నంబర్ ప్లేటు లేని ఓ కారులో పారిపోయారు. అయితే ఆమెకు మొబైల్ లేనప్పటికీ.. ఓ వ్యక్తి దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడని భర్త తెలిపాడు. ఆ ఫోన్ను రహస్యంగా వాడుతూ.. అతనితోనే పరారీ అయిందని భర్త తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులతో పిల్లాడి బర్త్ సర్టిఫికెట్ను కూడా తీసుకెళ్లినట్లు చెప్పాడు. భార్య, కుమారుడి ఆచూకీ కోసం భర్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిద్దరూ ఇంటికి తిరిగి రావాలి.. వారితో కలిసి ఉండటమే తన లక్ష్యమని బాధితుడు స్పష్టం చేశాడు.