Supreme Court | కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కేసులో కర్నాటక సీఎం సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతి, రాష్ట్రమతి బైరతి సురేశ్లకు జారీ చేసిన సమన్లు కర్నాటక హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్ను పరిశీలించిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును విచారించడం ఏమాత్రం ఇష్టం లేదని బెంచ్ స్పష్టం చేసింది. ఈడీని ఎందుకు రాజకీయ పోరాటలకు ఉపయోగిస్తున్నారంటూ ఘాటుగా ప్రశ్నించింది.
రాజకీయ యుద్ధాలను ఓటర్ల ముందు జరగనివ్వాలి అని సొలిటర్ జనరల్తో సీజీఐ అన్నారు. ‘మిస్టర్ రాజు దయచేసి మమ్మల్ని నోరు తెరవమని అడకండి. లేకపోతే మేం ఈడీ గురించి కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు నాకు మహారాష్ట్రలో కొంత అనుభవం ఉంది. మీరు దేశవ్యాప్తంగా ఈ హింసను కొనసాగించరు. ఓటర్ల ముందు ఈ రాజకీయ యుద్ధాలు జరగనివ్వండి. మిమ్మల్ని (ఈడీ) ఎందుకు.. ఉపయోగిస్తున్నారు? సింగిల్ జడ్జి అనుసరించిన నిర్ణయంలో ఎలాంటి లోపాలు కనిపించడం లేదు. విచిత్రమైన వాస్తవాలు, పరిస్థితుల్లో దాన్ని తోసిపుచ్చుతున్నాం’ అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.