కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్కు వెళ్లి బెంగాల్ గురించి మాట్లాడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖరగ్పూర్ సభలో ప్రసంగించిన ఆమె.. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే ప్రధాని బెంగాల్ గురించి ప్రస్తావించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని ఆమె మండిపడ్డారు.
2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా బంగ్లాదేశ్కు చెందిన ఒక నటుడు బెంగాల్లో తమ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారని, దాంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఆయన వీసాను రద్దు చేయించిందని మమతాబెనర్జి గుర్తుచేశారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుంటే మీరు బంగ్లాదేశ్లో బెంగాల్ గురించి ప్రసంగాలు చేస్తున్నారు. మీ వీసాను ఎందుకు రద్దు చేయకూడదు అంటూ ప్రధానిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ విషయమై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మమత పేర్కొన్నారు.