రాంచీ : అక్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాంచీలోని తమ ప్రాంతీయ కార్యాలయానికి గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరింది. కానీ ఇవాళ హేమంత్ సోరెన్ విచారణకు హాజరు కాలేదు.
ఈ సందర్భంగా సోరెన్ మాట్లాడుతూ.. నాపై రాజకీయ కుట్ర జరుగుతుంది. ఆదివాసీ సీఎం అయిన నన్ను వేధిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించే వారి గొంతు నొక్కుతున్నారు. తనను దోషిగా భావిస్తే ప్రశ్నించడం ఎందుకు? నేరుగా వచ్చి అరెస్టు చేయండి అని ఈడీ నోటీసులపై సోరెన్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఆ పని చేయండని చెప్పారు. ఈ కుట్రకు తగిన సమాధానం చెబుతామని సోరెన్ స్పష్టం చేశారు.
మనీలాండరింగ్ నియంత్రణ చట్టం(పీఎంఎల్ఏ) కింద సొరేన్ను ప్రశ్నిస్తామని, ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే సొరేన్ రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ ఏడాది జూన్ 8న రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పంకజ్ మిశ్రా, అతని సన్నిహితుల ఇండ్లలో సోదాలు జరిపింది.