న్యూఢిల్లీ, జూలై 11: ముందుగా సిద్ధం చేసుకోకుండా నిర్వహించే విలేకరుల సమావేశాలను ప్రధాని నరేంద్ర మోదీ చాలాకాలంగా నిరాకరిస్తూ దేశీయంగా, అంతర్జాతీయంగా కొనసాగిస్తున్న వైఖరి ఇటీవలి ఆయన ఆస్ట్రేలియా పర్యటన, ప్రస్తుతం న్యూజిలాండ్లో కొనసాగుతున్న పర్యటన సందర్భంగా మళ్లీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ నాయకుడు మీడియా నుంచి ముందుగా సిద్ధం చేయని ప్రశ్నలను ఎందుకు స్వీకరించరని నార్వేలో ఒక విలేకరి బహిరంగంగా అడిగినప్పటి ఘటనకు కొనసాగింపుగా న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో భారతీయ దౌత్యవేత్తలు కూడా అదే ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది. నేను ఒక సివిల్ సర్వెంట్ని కాబట్టి ప్రధాని మోదీ రాజకీయ విధానాలను ప్రశ్నించడం నాకు తగదు అని కేంద్ర విదేశాంగ శాఖ(ఎంఈఏ) కార్యదర్శి(తూర్పు) రుద్రేంద్ర టాండన్ బదులిచ్చారు. ఆయన(మోదీ) చాలా విజయవంతమైన రాజకీయ నాయకుడు. చాలామంది సంప్రదాయ భారతీయ రాజకీయ నాయకుల లాగే మోదీ కూడా తన ఓటర్లతో ప్రత్యక్ష సంబంధానికే ప్రాధాన్యత ఇస్తారు అని ఆయన చెప్పారు.
భారతీయ ఓటర్లలో అధిక భాగం గ్రామీణ ప్రాంతాలకు చెందినవారేనని, వారు నేరుగా నాయకులతో సంప్రదింపులు జరపడాన్ని కోరుకుంటారని మీరు గుర్తుంచుకోవాలి అంటూ విలేకరులను ఉద్దేశించి రుద్రేంద్ర చెప్పారు. తమను తక్కువ చేసి మాట్లాడటం గాని మధ్యవర్తుల ద్వారా మాట్లాడటం గాని వారికి నచ్చదని కూడా ఆయన అన్నారు. ఓటర్లతో నేరుగా మమేకమయ్యే కళలో మోదీ ఆరితేరారని ఆయన చెప్పారు. అంతేగాకుండా భారత్లో అత్యధిక కాలంపాటు ప్రధానిగా పనిచేసిన వారిలో మోదీ ఒకరని ఆయన గుర్తుచేశారు. కొన్ని రోజుల క్రితం మోదీ పర్యటనపై రిపోర్టింగ్ చేస్తున్న ఒక ఆస్ట్రేలియన్ జర్నలిస్టు ఆస్ట్రేలియా ప్రధాని(ఆల్బనీస్)తో కలసి చేసిన పర్యటనలో నరేంద్ర మోదీని మనం ఇంతకంటే దగ్గరగా చూడలేము. ఆయన(మోదీ) ముందుగా సిద్ధం చేసుకోని పత్రికా సమావేశాలకు దూరంగా ఉంటారని, బదులుగా ముందుగా సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారమే కనిపించడానికి ఇష్టపడతారని అందరికీ తెలిసిందే అని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన భారత్లో మోదీపై మళ్లీ విమర్శలను రాజేసింది. మోదీ తన మూడు పర్యాయాల పదవీకాలంలో స్వదేశంలో గాని విదేశాలలో గాని ఒక్కసారి కూడా ముందుగా సిద్ధం చేయని విలేకరుల సమావేశాలు నిర్వహించకుండా భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తించడం దిగ్భ్రాంతికరమని విపక్ష నేతలతోపాటు సోషల్ మీడియా యూజర్లు కూడా వ్యాఖ్యానించడం విశేషం.