న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభానికి, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ముడి పెట్టారు. “మన పొరుగు దేశంలో ఇటీవలి పరిణామాలతో ఆ దేశంలోని సిక్కులు, హిందువులు బాధపడుతున్నారు. అందువల్లే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించాం” అని ఆదివారం ట్వీట్ చేశారు.
2019 డిసెంబర్లో ఆమోదించిన సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పులు, ఆందోళనలతో తలెత్తిన హింసతో సుమారు 100 మంది మరణించారు. పొరుగున ఉన్న ముస్లిం మెజారిటీ దేశాల్లో అణచివేతకు గురై 2015కు ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వడానికి అనుమతినిస్తూ రూపొందించిన చట్టమే సీఏఏ.
ఆఫ్ఘనిస్థాన్లోని హిందువులు, సిక్కులకు సాయం చేస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. సాయం అవసరమైన దేశంలోని వారి స్నేహితులను ఆదుకుంటామని పేర్కొంది. తాలిబన్ల పాలన నుంచి విముక్తి కోసం ఇద్దరు సెనెటర్లతోపాటు 28 మంది ఆఫ్ఘనిస్థానీయులు సహా 168 మంది భారత్కు చేరుకున్నారు.