ED Director | న్యూఢిల్లీ, జూలై 26: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. కనీసం వచ్చే అక్టోబర్ 15వ తేదీ వరకైనా ఆయనను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. మిశ్రా పదవీకాలాన్ని కేంద్రం మూడోసారి పొడిగించటం చట్ట విరుద్ధమని ఈ నెల 11న జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ గవాయ్తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. మూడోసారి పదవీకాలం పొడిగింపు ప్రకారం మిశ్రా పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 18 వరకు ఉన్నది. అయితే, ఈ నెల 31తో ఆయన పదవీకాలం ముగుస్తుందని కోర్టు ప్రకటించింది. ఈ తీర్పును సవరించాలని కోరుతూ కేంద్రం బుధవారం పిటిషన్ దాఖలుచేసింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫైనాన్షియల్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) రివ్యూ ఉన్నందున మిశ్రాను ఈడీ డైరెక్టర్గా కొనసాగించటం తప్పనిసరి అని తెలిపారు. ఈ రివ్యూ కోసం అనేక నివేదికలు సిద్ధం చేయాల్సి ఉన్నదని, అందుకు మిశ్రా అనుభవం ఉపయోగపడుతుందని తెలిపారు. అందువల్ల తమ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరారు.
నాడు శక్తిసామర్థ్యాలు.. నేడు అనుభవం
ఈడీ డైరెక్టర్గా మిశ్రాను కొనసాగించాలన్న వాదనకు కేంద్రం చెప్పిన ఎఫ్ఏటీఎఫ్ ఒక సాకు మాత్రమేనని తేలింది. నిజానికి 11వ తేదీ నాటి విచారణ సందర్భంగా ఈడీ డైరెక్టర్గా మంచి శక్తిసామర్థ్యాలు కావాలి కానీ, అనుభవంతో పనిలేదని కేంద్రం వాదించింది. మిశ్రాకు ఆ శక్తిసామర్థ్యాలున్నాయి కాబట్టే ఆయన పదవీకాలాన్ని మూడోసారి పొడిగించామని తెలిపింది. బుధవారం మాత్రం అందుకు విరుద్ధమైన వాదన వినిపించింది. మిశ్రా అనుభవమే తమకు ముఖ్యమని తుషార్ మెహతా తెలుపటం విశేషం.
ఎఫ్ఏటీఎఫ్ సాకు మాత్రమే
ఎఫ్ఏటీఎఫ్ రివ్యూ కోసం మిశ్రా ఉండాలన్న కేంద్రం వాదన కూడా తప్పుదోవ పట్టించేదేనని తేలిపోయింది. ఎఫ్ఏటీఎఫ్లో దాదాపు 40 సభ్యదేశాలున్నాయి. ఉగ్రవాద, ఇతర చట్ట వ్యతిరేక సంస్థలకు నిధులు వెళ్లకుండా సభ్యదేశాలు ఎలాంటి చర్యలు తీసుకొన్నాయన్న అంశంపై పదేండ్లకోసారి ఈ సంస్థ రివ్యూ చేస్తుంది. ఈ రివ్యూ దాదాపు 18 నెలలు కొనసాగుతుంది. మనదేశంలో ఎఫ్ఏటీఎఫ్ రివ్యూ వచ్చే ఏడాది చివరి వరకూ కొనసాగనున్నది. రివ్యూలో ఈడీకి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎఫ్ఏటీఎఫ్ సమీక్షలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ), కేంద్ర న్యాయశాఖదే కీలకపాత్ర. ఈడీ రెవెన్యూశాఖ పరిధిలో పనిచేస్తుంది. ఎఫ్ఏటీఎఫ్ సమీక్షకు రెవెన్యూశాఖతో సంబంధమే లేదు. అలాంటప్పుడు ఈ రివ్యూలో ఈడీ పాత్ర నామమాత్రమే. 2016 నుంచి డైరెక్టర్గా ఉన్న పంకజ్ మిశ్రా పదవీకాలం పూర్తికాకముందే 2022లో మోదీ సర్కారు తొలగించింది. సమీక్షలో పెద్దగా ప్రాధాన్యం లేని ఈడీ డైరెక్టర్ పదవీకాలం మాత్రం మూడోసారి పొడిగించటం గమనార్హం.