BBC Documentary | భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పెద్ద దుమారం రేపుతోంది. అన్ని ఆధారాలు సేకరించి, పూర్తి విశ్లేషణ చేసిన తర్వాతే డాక్యుమెంటరీని రూపొందించామని బీబీసీ చెబుతుంటే.. బీజేపీ నేతలు మాత్రం దీన్ని తప్పుబడుతున్నారు. మోదీకి అపఖ్యాతిని అంటగట్టేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించారని బీజేపీ నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే డాక్యుమెంటరీపై భారత్లో నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ అంశానికి సంబంధించి విశ్లేషించిన వీడియోలను, ట్వీట్లపై కూడా ఉక్కుపాదం మోపుతోంది. ఆయా ప్లాట్ఫామ్ల్లో నుంచి తొలగిస్తుంది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు తప్పుబడుతున్నాయి. మొత్తానికి బీబీసీ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది.
మోదీ ఫస్ట్ క్వశ్చన్ పేరిట రూపొందించిన రెండు భాగాలుగా ఈ డ్యాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. 59 నిమిషాల నిడివితో బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో రాజకీయాల్లో నరేంద్ర మోదీ తొలి అడుగులు, సాధారణ కార్యకర్త నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరును దశలవారీగా చూపించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో జరిగిన అల్లర్ల గురించి ఈ డాక్యుమెంటరీలో ప్రధానంగా ప్రస్తావించారు. గోద్రా అల్లర్లు, ఆ సమయంలో సీఎంగా ఉన్న వైఖరి, దాన్ని రాజకీయంగా ఎలా వినియోగించుకున్నది? తదితర అంశాలను అందులో పేర్కొన్నారు.
అయితే గోద్రా అల్లర్లతో తనకు సంబంధం లేదని నరేంద్ర మోదీ మొదట్నుంచి చెప్పుకొస్తున్నారు. గుజరాత్ హింసాకాండలో మోదీ ప్రమేయం ఉందని చెప్పేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టు ఆయన్ను నిర్దోషిగా తీర్పునిచ్చింది. కానీ గోద్రాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడానికి కారణమైన వాతావరణం ఏర్పడటానికి ప్రత్యక్షంగా మోదీనే కారణమని అప్పట్లో బ్రిటీష్ దౌత్యవేత్త ఒకరు ఇచ్చిన నివేదిక గురించి డాక్యుమెంటరీలో చూపించారు. 2 వేల మందికి పైగా మరణించిన ఈ మారణకాండ పథకం ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన తొలి ఎపిసోడ్ జనవరి 17న యూకేలో తొలి భాగం ప్రసారమైంది. కానీ భారత్లో దీన్ని నిషేధించారు.
ప్రధాని మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీని బీబీసీ సమర్థించుకుంది. ఆయా అంశాలపై విస్తృతంగా పరిశోధించిన తర్వాతనే దీన్ని రూపొందించినట్టుగా తెలిపింది. దీనికోసం అప్పటి సాక్ష్యులు, నిపుణులను సంప్రదించామని.. బీజేపీ నాయకుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించామని పేర్కొంది.
మోదీపై బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీపై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్నది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ భారత్లో ప్రసారం కాకుండా చేసిన కేంద్ర ప్రభుత్వం.. దీనిపై విశ్లేషణ చేసిన వీడియోలను సైతం యూట్యూబ్లో బ్లాక్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం అత్యవసర అధికారాలు ఉపయోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ అంశంపై చేసిన ట్వీట్లకు సంబంధించిన 50 వరకు లింక్లను సైతం నిలిపేవేయాలని ట్విట్టర్ను ఆదేశించింది. వీటిలో ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, అమెరికన్ నటుడు జాన్ కసాక్ ట్వీట్లు కూడా ఉన్నాయి.
బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీపై బ్రిటన్ పార్లమెంట్లోనూ చర్చకు వచ్చింది. పాకిస్థాన్ మూలాలు ఉన్న ఎంపీ ఇమ్రాన్ హుస్సేస్ ఈ అంశంపై చర్చకు లేవనెత్తారు. గుజరాత్ అల్లర్లకు మోదీ ప్రత్యక్ష కారణమంటూ బ్రిటీష్ విదేశాంగ కార్యాలయ దౌత్యవేత్తలు చెప్పిన విషయాలను అంగీకరిస్తారా? అని ప్రధాని రిషి సునాక్ను ప్రశ్నించారు. దీనికి రిషి సునాక్ మిశ్రమంగా స్పందించారు. ప్రపంచంలో ఎక్కడ హింస జరిగినా సహించమని చెబుతూనే.. గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్ర ఉందన్న ఆరోపణలతో ఏకీభవించనని పేర్కొన్నాడు. వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు.
బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ గురించి తమకు తెలియదని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్కు వాటి భాగస్వామ్య విలువ గురించి బాగా తెలుసని పేర్కొన్నారు. ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై తమ దృష్టి ఉంటుందని.. ఈ బంధాన్ని బలోపేతం చేసే అంశాలపై ఆలోచిస్తామని చెప్పారు. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని తెలిపారు. భారత్ అమెరికా ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉందని పేర్కొన్నారు.