డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ మరోసారి చరిత్ర సృష్టించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అయితే బీజేపీ నేత, సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి పాలయ్యారు. ఖతిమా స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్కు చెందిన భువన్ కప్రీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇంతకు ముందు పలువురు సీఎంలు సైతం ఉత్తరాఖండ్లో పరాజయం పాలైన సంఘటనలూ ఉన్నాయి. తొలిసారిగా భువన్ చంద్ర ఖండూరి, ఆ తర్వాత హరీశ్ రావత్, ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామీ సీఎంగా ఉంటూ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామీ ఓటమితో ముఖ్యమంత్రి పీఠం ఎవరనే చర్చ ప్రస్తుతం జోరందుకుంది. నిజానికి ఎన్నికలకు ఆరు నెలల ముందు కాషాయ పార్టీ ఉత్తరాఖండ్లో ముగ్గురు సీఎం అభ్యర్థులను మార్చింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా 2012లో సీఎం, బీజేపీ అభ్యర్థి భువన్ చంద్ర ఖండూరి కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర సింగ్ నేగి చేతిలో 4వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2017లో జరిగిన ఎన్నికల్లో హరిద్వార్ రూరల్ స్థానం నుంచి బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి స్వామి యతీశ్వరానందపై సీఎం హరీశ్రావు 12వేలకుపైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పుష్కర్ సింగ్ ధామీ 6,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో బీజేపీ అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్నది. ఖతిమా నియోజకవర్గం నుంచి ఓటమిపాలైనా ఆయనకు బీజేపీ కానుక ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఓటమి తర్వాత సైతం సీఎంగా కొనసాగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఆరు నెలల కిందట ధామీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తక్కువ సమయంలోనే వ్యతిరేకత ఉన్నా.. బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఆయన స్థానంలో వేరే వారిని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తే.. అనిల్ బలూని లేదంటే రమేశ్ పోఖ్రియాల్కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఉత్తరాఖండ్కు చెందిన రాజ్యసభ ఎంపీ అయిన అనిల్ బలూని హోంశాఖ మంత్రి అమిత్ షాకు సన్నిహితుడు. అలాగే రాష్ట్రానికి చెందిన బీజేపీకి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ను సైతం సీఎంగా నిలబెట్టే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆయన సైతం లోక్సభ ఎంపీగా ఉన్నారు. గతంలోనూ బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో సీఎం కొత్త ముఖాలను తెరపైకి తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మోదీ, అమిత్ షా నిర్ణయాలు ఇప్పటికే పలువురిని ఆశ్చర్యానికి గురి చేయగా.. ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే చర్చ సాగుతున్నది.