Delhi CM | ఢిల్లీ, ఫిబ్రవరి 8: 27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్నది. దీంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ జోరందుకున్నది. కమలం పార్టీ అధికారికంగా సీఎం పేరు ప్రకటించనప్పటికీ, ఈ రేసులో ముందంజలో ఉన్న పలువురి పేర్లు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
పర్వేశ్ వర్మ: ఈయన ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై వర్మ గెలుపొందడం విశేషం. ఇది ఆయనకు కలిసొచ్చే అంశం.
రమేశ్ బిధూరి: ఈయన మాజీ ఎంపీ. గుజ్జర్ సామాజికవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు. ఢిల్లీ సీఎం ఆతిశీపై పోటీ చేశారు. రమేశ్ ఢిల్లీ బీజేపీలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు.
బన్సూరి స్వరాజ్: విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్. న్యూఢిల్లీ నుంచి మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి తక్కువ కాలంలోనే ఢిల్లీ బీజేపీలో గుర్తింపు పొందారు.
స్మృతి ఇరానీ: ఒకప్పటి బీజేపీ ముఖ్య లీడర్లలో స్మృతి ఇరానీ ఒకరు. కానీ, గత లోక్సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆమె తెరమరుగయ్యారు. ఇప్పుడు సీఎం రేసులో ఆమె కూడా ఉన్నట్టు సమాచారం.