ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. (Sanjay Raut questions Raj Thackeray) మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే కూటమికి మాత్రమే తమ పార్టీ మద్దతు అని తెలిపారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ‘బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ’ మహాకూటమికి ఎంఎన్ఎస్ బేషరతుగా మద్దతిస్తుందని చెప్పారు. కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కాగా, బీజేపీకి బేషరతుగా మద్దతిస్తున్నట్లు రాజ్ ఠాక్రే ప్రకటించడంపై శివసేన (యుబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం స్పందించారు. దీని వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రాజ్ ఠాక్రేపై మోదీ ఏదో ఫైల్ తెరిచి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు అకస్మాత్తుగా ఏదో అద్భుతం జరిగింది. దీని గురించి ఆయన(రాజ్ ఠాక్రే)ను అడగాలి. మీరు హఠాత్తుగా యూటర్న్ తీసుకుని మహారాష్ట్ర శత్రువులకు మద్దతు ఇస్తున్నారు. ప్రజలకు మీరు ఏమి చెబుతారు? దీని వెనుక కారణం ఏమిటి? మీపై ఏదైనా ఫైల్ తెరిచారా?’ అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.