Congress Presidential Election | కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్కు మధ్య గట్టి పోటీ జరుగనున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్కొంటుండగా.. కర్నాటకలో సాగుతున్నది. ఈ క్రమంలో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేస్తారా? ఎక్కడ ఓటు వేస్తారు? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఏఐసీసీ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్ స్పందించారు. కర్నాటకలోని బళ్లారిలో భారత్ జోడో యాత్ర క్యాంప్సైట్లో రాహుల్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేస్తారని పేర్కొన్నారు. రాహుల్తో యాత్రలో పాల్గొంటున్న మరో 40 మంది ప్రతినిధులు సైతం ఇక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తాత్కాతిక అధ్యక్షురాలుగా ప్రస్తుతం సోనియా గాంధీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అనారోగ్యం దృష్ట్యా ఆమె పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సైతం బాధ్యతలు తీసుకునేందుకు ససేమిరా అనడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. 24 సంవత్సరాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. 137 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించడం ఇది ఆరోసారి. మరో వైపు ఎన్నికల నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.