న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పన్నులు పెంచి రూ.26లక్షల కోట్లు వసూలు చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. చమురు ధరలను యూపీయే హయాంలోని ధరలకే అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేసింది. సిగ్గులేని దోపిడీని ఆపాలని, ద్రవ్యోల్బణం ప్రజల జీవితాన్ని నాశనం చేసిందని మండిపడింది. ద్రవ్యోల్బణం అంశంపై మంగళవారం కాంగ్రెస్ పార్టీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిపించండి.. హోలీ రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ల తీసుకెళ్లాలని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారని.. తాజాగా సిలిండర్లు ఉచితంగా ఇవ్వకుండా.. మరింత భారం మోపారని పేర్కొన్నారు. 2014 మేలో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం లీటర్కు రూ.9.20 మాత్రమేని, డీజిల్పై సుంకం లీటర్కు రూ.3.46గా ఉండేదని.. ఇప్పుడు పెట్రోల్పై రూ.18.70, డీజిల్పై రూ.18.34కి బీజేపీ ప్రభుత్వం పెంచిందని ఆరోపించింది. యూపీఏ పాలనలో కంటే ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్పై 203, డీజిల్పై 531 శాతం ఎక్కువని పేర్కొంది.
2014-15 నుంచి 2021-22 వరకు ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పలుమార్లు పన్నులు పెచుతూ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. 8 ఏళ్లలో రూ.26లక్షల కోట్లను ప్రజల నుంచి వసూలు చేసిందని, లాక్డౌన్ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను పదే పదే పెంచుతూ వచ్చారని, ఎక్సైజ్ సుంకాన్ని దండుకున్నారని మండిపడింది. 22 మార్చి 2020న, రెండేళ్ల క్రితం ఇదే రోజున.. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 69.59, రూ. 62.29 ఉన్నాయని. ఇప్పుడు లీటర్కు రూ. 96.21, రూ. 87.47కి పెరిగాయని పేర్కొన్నది.
2014 మే 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశంలోని చమురు కంపెనీలు బ్యారెల్ ముడి చమురును 108 డాలర్లకు పొందాయని కాంగ్రెస్ పేర్కొంది. ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్కు 108.25 డాలర్లు ఉందని.. ఆ సమయంలో పెట్రోల్ రూ.71.41, డీజిల్ రూ. 55.49 అందుబాటులో ఉంటే.. ఇప్పుడు పెట్రోల్ రూ.96.21, డీజిల్ రూ. 87.47 చొప్పున విక్రయిస్తున్నట్లు ఆరోపించింది. ముడి చమురు ధరలు గతంతో పోలిస్తే సమానంగా ఉన్నా.. పెట్రోల్పై రూ.24.80, డీజిల్పై రూ.31.98 చొప్పున పెంచాయని ధ్వజమెత్తింది. దేశ ప్రజలను మోసం చేసి కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకుంటున్నారనడానికి ఇదే అతిపెద్ద సాక్షమన్నది.
సౌదీకి చెందిన అరామ్కో ఎల్పీజీ ధరల ఆధారంగా.. ఎల్పీజీ రేట్లు నిర్ణయించబడుతున్నాయి. ప్రస్తుతం రేటు మెట్రిక్ టన్నుకు 769.11 డాలరు. భారత కరెన్సీలో మెట్రిక్ టన్నుకు రూ.58,367.75. అంటే ఎల్పీజీ అంతర్జాతీయ ధర కిలోకు రూ.58.37. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రూ.14.2 కిలోలు ఉంటుంది. దీంతో ఒక్కో సిలిండర్ ధర రూ.828.82 అవుతుందని, ఈ ధరపై మోదీ ప్రభుత్వం 5శాతం జీఎస్టీ విధిస్తుందని, బాటిలింగ్ ఫీజు, ఏజెన్సీ కమిషన్ రవాణా చార్జీలతో కలిపి దేశ ప్రజల నుంచి సిలిండర్కు రూ.రూ.949 రూ.1100 వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. యూపీఏ హయాంలో ఎల్పీజీ అంతర్జాతీయ ధర 885.2 డాలర్లు కొనుగోలు చేసినా.. సామాన్య ప్రజలకు సబ్సిడీపై రూ.399 నుంచి రూ.414కి అందించి ఊరట కల్పించిందని పేర్కొంది.