న్యూఢిల్లీ, అక్టోబర్ 2: స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా, దేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. మధ్యప్రదేశ్లో గ్రామపంచాయతీలో ఓ దళితుడు కుర్చీలో కూర్చున్నందుకు అగ్రకులస్థుడు అతడి తల పగలగొట్టడం.. ఉత్తరప్రదేశ్లోని ఔరియా జిల్లాలో తరగతి నోట్స్లో తప్పులు రాశాడని టీచర్ ఓ దళిత విద్యార్థిని చితకబాదడంతో మరణించడం.. ఇదే యూపీలోని లఖింపూర్లో ఇద్దరు దళిత అక్కాచెలెళ్లను రేప్ చేసి హత్య చేయడం.. రాజస్థాన్లో నీటి కుండను తాకాడని ఓ దళిత విద్యార్థిని తీవ్రంగా కొట్టిన ఘటన.. ఇలా దళితులపై వివక్ష చూపేలా.. వారిని వేధించేలా జరుగుతున్న ఘటనలు దేశంలో కొకొల్లలు. కేంద్రంలో, రాష్ర్టాల్లో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ఈ విష ధోరణి మరింత పెచ్చరిల్లుతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితుల పరిస్థితి దయనీయంగా మారింది.
11 శాతం పెరిగిన దాడులు
2019 నుంచి 2021 వరకు దేశంలో దళితులపై దాడులు 11 శాతం పెరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) ప్రకారం.. 2019లో 45,961, 2021లో 50,900 కేసులు నమోదయ్యాయి. దళితులపై జరుగుతున్న దాడుల్లో జాతీయ సగటు కంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అధికంగా ఉన్నది. మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. రాజస్థాన్, తమిళనాడు వంటి ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లో కూడా ఇది కనిపిస్తున్నది. దళితులపై దాడుల ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నా.. వాటిపై ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం తగిన విధంగా స్పందించి, చర్యలు తీసుకుంటున్న సందర్భాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
వివక్ష సమాజం ఇంకానా?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. దళితులు ఇంకా హింస, అణచివేతకు గురౌతుండటం వివక్షతో నిండిన సమాజం ఇంకా కొనసాగుతుందనే వాదనకు అద్దం పడుతున్నది. డాటా అందుబాటులో ఉన్న 1991 నుంచి 7 లక్షలకు పైగా అట్రాసిటీ కేసులు పోలీసుల వద్ద నమోదయ్యాయి. ఇవి అధికారికంగా నమోదైన కేసులు మాత్రమే. అనధికారికంగా దళితులపై జరుగుతున్న దాడులు భారీగా ఉండే అవకాశం ఉన్నది.